Bhajantrilu
Tuesday, October 30th, 2007 at 12:00 am
భజంత్రీలు
హాస్య నటునిగా ప్రేక్షక లోకంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెస్ నారాయణ రెండేళ్ల క్రితం దర్శకుడిగా అవతారమెత్తి, తొలి యత్నంగా ‘కొడుకు’ అనే సినిమాని రూపొందించారు. ఆ సినిమాతో తన కొడుకు విక్రంని హీరోగా పరిచయం చేశారాయన. దురదృష్టవశాత్తూ ఆ సినిమా ఫ్లాపయింది. దాని తర్వాత విక్రంకి మరో అవకాశం రాలేదు. ఎమ్మెస్ ఇప్పుడు ‘భజంత్రీలు’తో దర్శకుడిగా రెండో ప్రయత్నం చేశారు. ఇందులోనూ తన కుమారుడు విక్రంని ఓ హీరోగా చూపించారు. మరో హీరోగా శివాజీ నటించాడు. వారి సరసన హీరోయిన్లుగా శివానీ, సుస్మిత నటించారు. దేవీ మూవీ మేకర్స్ ప్రై. లిమిటెడ్ బానర్పై సీనియర్ ప్రొడ్యూసర్ కె. దేవీవరప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. చిరంజీవితో చట్టంతో పోరాటం, కొన్డవీటి రాజా, మంచి దొంగ, ఘరానా మొగుడు, అల్లుడా మజాకా వంటి సినిమాలని ఆయన నిర్మించారు. ఆయన చివరగా తీసిన సినిమా ‘మృగరాజు’. ‘భజంత్రీలు’ను కామెడీ ప్రధానంగా రూపొందించారు ఎమ్మెస్. పండగల సందర్భాలలో, పెళ్లిళ్లలో బ్యాండు మేళాలికి
ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలిసిందే. అలాంటి బ్యాండు మేళాలు వాయించే ఇద్దరు కుర్రాళ్ల కథ ఈ సినిమా అని ఎమ్మెస్ తెలిపారు. ‘ఆద్యంతం నవ్వులు కురిపించే ఈ సినిమాలో మనసుని తడిచేసే చెల్లి సెంటిమెంటు కూడా ఉంది. రెండు గంటలపాటు మంచి వినోదాన్ని పొందాలనుకునే వాళ్ళు ఈ సినిమాకి వస్తే చాలు’ అని ఆయనన్నారు. చక్రి సంగీతం సమకూర్చిన ఇందులో 5 పాటలున్నాయి. అవన్నీ సందర్భోచితంగా వస్తాయని చక్రి చెప్పారు. హీరోలుగా నటించిన శివాజీ, విక్రమ్ సినిమా విజయం పట్ల గట్టి ధీమాతో ఉన్నారు. ముఖ్యంగా ఇది తన కెరీర్కు పెద్ద పరీక్ష కావడంతో విక్రమ్ ఆశలన్నీ దీనిపై ఉన్నాయి. చిత్రసీమలోని పేరుపొందిన కమెడియన్లు చాలామంది ఇందులో నటించారు. బ్రహ్మానందం, అలీ, సునీల్, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరాం, కృష్ణభగవాన్, ధర్మవరపు, చలపతిరావు, కొండవలస, మల్లికార్జునరావు, రఘుబాబు, జీవా వారిలో ఉన్నారు. ఫణిప్రసాద్ మాటలు రాసిన ఈ సినిమాకి ఎం.వి. రఘు సినిమాటొగ్రాఫర్. నవంబర్ 1న ‘భజంత్రీలు’ ప్రేక్షకుల మధ్యకు వస్తున్నాయి.




























