Chiru party on April 7th confirmed
Wednesday, February 6th, 2008 at 12:00 am
చిరంజీవి రాజకీయ పార్టీ ప్రకటన ఉగాది రోజు అంటే ఏప్రిల్ 7న ఖాయమని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఆ పార్టీకి ‘స్వయంకృషి పార్టీ’ అనే పేరు కూడా దాదాపు ఖాయమని, ఇప్పటికే ఈ పార్టీ గుర్తింపు కోసం ఎన్నికల కమీషన్కు దరఖాస్తు చేశారని కూడా ఆ వర్గాలు తెలిపాయి. పార్టీ గుర్తు రెండు నేత్రాలు. చిరంజీవి పార్టీ ఏప్రిల్ 7న రానున్నదని జనవరి 27నే చిత్రమాల ప్రచురించిన సంగతి గమనార్హం. 2009లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ పోటీ చేయనున్నది. అంటే ఆ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగనున్నదన్న మాట. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ ఒక్కటే బలమైన పార్టీగా వుంది. దానిపై విజయం సాధించి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇప్పుటి పరిస్థితులు వేరుగా వున్నాయి. చిరంజీవి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో ఢీకొనాల్సి ఉంది. తెలంగాణలో టిఆర్ఎస్ కూడా బలంగా వున్నందున అక్కడ చతుర్ముఖ పోటీ తప్పదు. ఈ పరిస్థితిని చిరంజీవి పార్టీ ఎలా అధిగమిస్తుందనేదే ఆసక్తికరం.




























