ఎప్పటినుంచో ఉర్రూతలూగిస్తున్న సినీనటుడు చిరంజీవి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయటానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అందరూ అనుకుంటున్నట్టుగానే తెలుగు సంవత్సరాది అయిన ఉగాదికి అనగా ఏప్రిల్ 7న చిరు పార్టీని విడుదల చేయనున్నారు. పార్టీ గుర్తు నేత్రం. పార్టీ పేరు స్వయంకృషి. పార్టీ అజెండా అవినీతిపై పోరు. వీరాభిమాని సత్తిబాబు కథనం ప్రకారం రెండునెలల తర్వాత చిరంజీవి తప్పనిసరిగా పార్టీ పేరును విడుదల చెయ్యాలని, అంతవరకు ఆగలేకపోతున్నామని చెప్పారు.
వివిధ నేతల స్పందన: చిరంజీవితో వివిధ పార్టీలకు చెందిన నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా బి.జె.పి. సీనియర్ నేత సి.హెచ్.విద్యాసాగర రావు మాట్లాడుతూ చిరు పార్టీని స్వాగతిస్తున్నామని, ఆయన బి.జె.పి. పార్టీలోకి వస్తే ఇంకా మంచిదని, ఆయనకున్న అభిమానులకు తోడు, బి.జె.పి. జాతీయ పార్టీ కాబట్టి, అధికారంలోకి రావటం సులువౌతుందని చెప్పారు. కాంగ్రెస్ నేత పాలడుగు వెంకట్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేవాలయం లాంటిదని, భక్తులు భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్తారని, చిరంజీవి పార్టీ పెడితే కాంగ్రెస్ పార్టీలోనికి రావల్సిందిగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. టి.ఆర్.ఎస్.నేత ప్రకాష్ మాట్లాడుతూ చిరు ఆంధ్రలో పార్టీ పెడితే ముఖ్యమంత్రి అవటం ఖాయమని, అయినా చిరంజీవి రాజకీయాల్లోకి రాడని తామనుకుంటున్నామని, రాజకీయాల్లోకి వస్తే పోలింగ్ బూత్లలో డబ్బులివ్వాల్సివస్తుందని, ఆయన అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతాడుకాబట్టి అటువంటివి ఒప్పుకోడని, అందుకే ఆయన రాజకీయాల్లోకి రాడని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా చిరు అభిమానుల కోలాహలం: పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం లలో చిరు అభిమానులు మీడియాలో వస్తున్న వార్తలను చూసి మిఠాయిలను పంచి భారీర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా కరీంనగర్లో కూడా చిరూభిమానుల కోలాహలం మిన్నంటింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధజిల్లాలలో చిరు అభిమానులు రోడ్లమీదకువచ్చి సంబరాలు జరుపుకుంటూ, బాణాసంచా పేలుస్తున్నారు. జిల్లాలలో ఎక్కడచూసినా చిరు అభిమానుల కోలాహలమే కనిపిస్తుంది.




























