Nagababu getting close to public
Tuesday, July 1st, 2008 at 12:09 pm

రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ అభిమానులతో మాట్లాడుతున్న చిరంజీవి సోదరుడు నాగబాబు సాధారణ ప్రజలను కూడా బాగా ఆకట్టుకుంటున్నారు. సోమవారం ఆయన విశాఖపట్నం సమీపంలోని యలమంచిలి, పాయకరావుపేట పట్టణాల్లో పర్యటించినప్పుడు విశేష స్పందన లభించింది. ’వచ్చేస్తున్నాయ్ వచ్చేస్తున్నాయ్.. జగన్నాథ రథచక్రాలు వచ్చేస్తున్నాయ్’ అంటూ ఆయన అభిమానుల్ని ఉత్సాహపరిచారు. "జగన్నాథులు మీరే. చిరు రథాన్ని నడిపించండి. అన్నయ్య వస్తున్నాడు. మీకు కావలసింది చేస్తాడు" అని పదేపదే చెబుతూ వారిని ఆకట్టుకున్నారు. ఆయన పర్యటనకు ఊహించని విధంగా అభిమానులు తరలిరావడంతో చిరు అభిమాన సంఘాలు ఆనందభరితమయ్యాయి. ఉదయం 9 గంటలనుంచే జాతీయ రహదారిపై పలు జంక్షన్ల వద్ద అభిమానులు నాగబాబు కోసం ఎదురుచూశారు. పాయకరావుపేట, యలమంచిలిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న నాగబాబు అభిమానుల తాకిడి నుంచి బయటపడేందుకు బాగా ఇబ్బందిపడ్డారు. వాహనం దిగి కార్యక్రమాల్ని ప్రారంభించే అవకాశం లేకుండా పోయింది. దాంతో ఆయన పలు కార్యక్రమాల్ని ప్రారంభించకుండానే అభిమానులకు అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. రెండు నియోజక వర్గాల్లో పలు గ్రామాల నుంచి అభిమానులు వ్యాన్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలపై తరలివచ్చారు. యలమంచిలి డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగిన కార్మిక, కర్షక సదస్సుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో బారికేడ్లు విరిగిపోయాయి.


(5 votes, average: 4.2 out of 5)
























