
Kantri

| Cast : Jr NTR, Hansika Motwani |
| Director : Meher Ramesh |
| Music Director : Mani Sharma |
| Producer : C.Aswini Dutt |
| Banner : Vyjayanthi Movies |
|
వేసవిలో ఇప్పుడందరి దృష్టీ 'కంత్రి' మీదే. 'యమదొంగ' వంటి హిట్ తర్వాత ఎన్టీఆర్ టైటిల్ రోల్ చేసిన సినిమా కావడమే దానికి కారణమని వేరే చెప్పనవసరం లేదు. వైజయంతీ మూవీస్ బానర్పై భారీ బడ్జెట్ సినిమాల నిర్మాత చలసాని అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించడం దాని విలువను మరింత పెంచింది. పూరీ జగన్నాథ్ శిష్యుడు, కన్నడంలో రెండు సినిమాలను డైరెక్ట్ చేసిన మెహర్ రమేష్ తెలుగులో తొలిసారి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. 'దేశముదురు'తో హీరోయిన్గా తెరంగేట్రం చేసి తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని దోచుకున్న హన్సికా మొత్వానీ ప్రధాన హీరోయిన్ కాగా, 'నీల్ అండ్ నిక్కీ' నాయిక, కాజోల్ చెల్లెలు తనీషా రెండో హీరోయిన్ పాత్రని చేసింది. 'కంత్రి' పాతికేళ్ల యువకుడి ప్రేమకథ. ఆ పాత్ర మహిళల్నీ, యువతనీ బాగా ఆకర్షిస్తుందని ఎన్టీఆర్ చెబుతున్నాడు. కథలోని మలుపు ప్రేక్షకుల్ని అలరిస్తుందని అంటున్నాడు. 'యమదొంగ' కోసం తొలిసారిగా పాడిన అతను '123 నేనొక కంత్రి' పాటను పాడాడు. ఆ పాట ఇప్పటికే చాలామంది నోట వినిపిస్తోంది. సినిమాలో మొత్తం ఆరు పాటలున్నాయి. వీటికి మణిశర్మ బాణీల్ని కూర్చాడు. రెండు డ్యూయెట్లని దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో చిత్రీకరించారు. 'కంత్రి'లో రాజకీయ సంభాషణలున్నాయనీ, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎన్టీఆర్ డైలాగులు చెబుతాడనీ ప్రచారమవుతోంది. అయితే దీన్ని ఎన్టీఆర్ ఖండిస్తున్నాడు. "ప్రత్యేకంగా ఓ పార్టీ గురించో, మరొకరి గురించో ప్రస్తావించే రాజకీయ సంభాషణలు ఇందులో లేవు. కథానుగుణంగా సామాజిక శ్రేయస్సు దృష్ట్యా కొన్ని మాటలున్నా వాటికి రాజకీయాలతో ముడిపెట్టలేం" అని అతను తెలిపాడు. అయితే ఉన్నాయని చెబితే ఇప్పట్నించే విమర్శలు మొదలవుతాయనే ఉద్దేశంతోటే ఎన్టీఆర్ అలా చెబుతున్నాడని ఫిల్మ్నగర్ వర్గాలు అంటున్నాయి. 'కంత్రి' పబ్లిసిటీ పట్ల ఎన్టీఆర్ అభిమానులు అసంతృప్తిగా వుండటం గమనించదగ్గ అంశం. ఆడియోను చడీచప్పుడు లేకుండా మార్కెట్లో విడుదల చేయించిన నిర్మాత అశ్వనీదత్ ఆ తర్వాత కూడా సినిమాకి సరైన ప్రచారం ఇవ్వడం లేదనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. 'జల్సా'కి జరిగిన ముందస్తు భారీ ప్రచారంతో పోల్చుకుంటే 'కంత్రి'కి అసలు పబ్లిసిటీ లేనట్లుగా వుందని వారంటున్నారు. 'యమదొంగ' మాదిరిగానే ఈ సినిమాలోనూ ఎన్టీఆర్ చేసే డాన్సులు, ఫైట్లు ప్రేక్షకుల్ని బాగా అలరిస్తాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కూచిపూడిలో చిన్నతనంలోనే శిక్షణపొందిన ఎన్టీఆర్ ఈ సినిమాలోని ఒక పాటలో సంప్రదాయ దుస్తులు ధరించి చేసే కూచిపూడి నాట్యం ప్రత్యేక ఆకర్షణ అవుతుందని వారు అంటున్నారు. ఎన్టీఆర్ తండ్రి పాత్రను ప్రకాష్రాజ్ చేసిన ఈ సినిమాలో 'అతిథి' ఫేమ్ మురళీశర్మ, సాయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, కోట శ్రీనివాసరావు, సునీల్, సుబ్బరాజు, రఘుబాబు, అలీ, బ్రహ్మానందం, కృష్ణభగవాన్, ధర్మవరపు తదితరులు తారాగణం. సమీర్రెడ్డి సినిమాటోగ్రాఫర్ కాగా, స్టన్ శివ యాక్షన్ ఎపిసోడ్లకి నేతృత్వం వహించాడు. అత్యంత భారీ అంచనాల నడుమ మే 9న 'కంత్రి' ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. |
|
News | Box Office | Previews | Reviews | Trailers | Galleries | Wallpapers | Events | Videos | Audio Songs
©2006 - 2008 Chitramala.com. All rights reserved.



























